Thursday 9 September, 2010

ఏం పీకుతున్నారు బయటకెళ్ళి?

ఉదయం తొమ్మిదవుతోంది.


ఆరింటికే వివిధ చానెళ్ళలో మొదలయిన సీరియళ్ళను ఒక పట్టుపడుతూ ఇంకా పళ్ళు కూడా తోముకోకుండా కూర్చున్న రమ్య కాలింగ్ బెల్ మోగితే విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కేబుల్ అబ్బాయి. "సారు ఈ నెల కేబుల్ డబ్బులింకా ఇవ్వలేదమ్మా" అన్నాడు. "ఈయన పనులన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఇప్పుడు వీడు కేబుల్ కట్ చేస్తే అదొక చావు" అని భర్తను మనసులోనే విసుక్కుని "ఆయనతో చెపుతాను. రేపు తప్పకుండా ఇచ్చేస్తార్లే" అని సర్దిచెప్పి పంపేసి మళ్ళీ టి.వి. ముందు సెటిలయ్యింది. అయిదు నిమిషాలు గడిచిందో లేదో ఫోన్ మోగింది. పిల్లల స్కూలు నుంచి ప్రిన్సిపాల్. టర్మ్ ఫీజు కట్టటానికి ఇవాళే ఆఖరి రోజనీ, ఇప్పటికే రెండు రిమైండర్లు పంపించామనీ ఇంకా ఆలస్యమైతే కష్టమనీ దులిపి పారేసింది. ప్రిన్సిపాల్ చెడుగుడు కన్నా ఈ గొడవవల్ల అయిదునిమిషాలు చిట్టెమ్మ సీరియల్ మిస్సయినందుకు తిక్కరేగిన రమ్యకు భర్త మీద పీకలదాకా కోపం వచ్చింది. "పొద్దున్నే ఆఫీసుకంటూ టింగురంగామని బైకుమీద వెళ్ళిపోతాడు, రాత్రిగ్గానీ ఇంటికిరాడు. మధ్యలో ఈయన వెలగబెడుతున్న రాచకార్యాలేమిటో? కాస్త వీటి సంగతి చూస్తే ఆయన సొమ్మేంబోయిందటా?" చిరాగ్గా అనుకుని భర్తకు ఫోన్ చెయ్యనారంభించింది, టి.వి.లో ప్రకటనలు మొదలవ్వటంతో.


ఎంతకీ ఫోను కలవటంలేదు. "ఏడ్చినట్లుంది, ఫోనుబిల్లు కట్టటం కూడా మర్చిపోయినట్లున్నాడు మతిమరపు మొగుడు" కసిగా అనుకుంది రమ్య. కాస్సేపటికి మళ్ళీ సీరియళ్ళ మాయలో పడిపోయి తాత్కాలికంగా సమస్యను మర్చిపోయింది. రాత్రికి ఇల్లు చేరిన నారాయణను చూస్తేగానీ మళ్ళీ విషయం గుర్తుకు రాలేదు. గుర్తొచ్చిన వెంటనే గయ్యిమని లేచింది "ఏం పీకుతున్నారు మీరు బయటికెళ్ళి? బైకుమీద ఝామ్మంటూ వెళ్ళడం, ఓ పదో పన్నెండో గంటలు ఏ.సి. ఆఫీసులో కూర్చుని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుని రావటం. ఈమాత్రానికే ఏదో సంసార సాగరాన్ని మీరొక్కళ్ళే ఈదుతున్నట్లు ఫోజొకటి." ధారావాహికగా సాగిపోతున్న రమ్య వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అన్నాడు నారాయణ "అది కాదు రమ్యా, ఇవాళ ఒక బాల్య మిత్రుడు కలిశాడు. ఏదైనా మనసుకు హత్తుకునేట్లు చెప్పడంలో వాడు దిట్ట. ఇదే విషయం మామధ్య చర్చకు వచ్చిందివాళ. అప్పుడు వాడు చెప్పింది ఇదిగో ఇలా ఉంది.


మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మనం భార్య పిల్లలకోసం తెగ కష్టపడిపోయి,

బాసు తిట్టినా, క్లైంటు కోప్పడినా ఆ విషయం ఆఫీసులోనే మర్చిపోయి,

పక్క సీటు పంకజం అమ్మాయిననే వంకబెట్టుకుని ఆరింటికే ఆఫీసునించి తుర్రుమంటే ఆవిడ పనికూడా తన నెత్తిమీదపడినా విసుక్కోకుండా ఎంత రాత్రయినా ఉండి పూర్తి చేసి,

నరకాన్ని తలపించే రోడ్లమీద ప్రతి కిలోమీటరుకూ ఏర్పడే ట్రాఫిక్ జాములను రోజుకు రెండుసార్లు చచ్చీ చెడీ దాటుకుంటూ,

ఆఫీసు సమస్యలు ఆఫీసులోనే మర్చిపోవాలని, భార్యాపిల్లలమీద వాటిని చూపించకూడదన్న మాటను అక్షరాలా పాటించి,

ఇంటికెళ్ళి భార్యను నవ్వుతూ అస్సలు పలకరించకూడదన్నమాట.

ఎందుకంటే అలా చేస్తే మనం ఆఫీసులో అస్సలు కష్టపడటంలేదనీ, వీళ్ళు చేసేదల్లా మడత నలక్కుండా ఏ.సి. ఆఫీసులో గంటల తరబడి కూర్చుని రావటమేనన్న అభిప్రాయం వాళ్ళకేర్పడుతుంది.


ఇహ మనం ఏంచెయ్యాలయ్యా అంటే, బాసు తిట్టినా, ప్యూను తిట్టినా, ఎర్ర లైటు దగ్గర జీబ్రా క్రాసింగ్ వెనకాల ఆగలేదని పోలీసు తిట్టినా, ఆఖరికి మన పక్కింటోడిని వాడి పెళ్ళాం తిట్టినాసరే(మరి మన మగాళ్ళ ఐకమత్యం ప్రదర్శించొద్దూ) ఇంటికొచ్చేసి పెళ్ళాం మీద నిర్మొహమాటంగా విరుచుకు పడిపోవాలి.ఎప్పుడూ ఆఫీసొదలగానే ఇంటికొచ్చెయ్యడమేనా, కాస్త అలా అలా ఒక్కసారి టాంక్ బండ్, లుంబిని పార్క్ వగైరా వగైరాలు ఒక్కళ్ళమే తిరిగేసి కాస్త "పిల్ల" గాలి పీల్చి రావాలి. అంతగా ఇంట్లో ఆరాలు గట్రా పెడితే ఉండనే ఉందిగా, "ఆఫీసులో ఆలస్యమయ్యింది" అనే తారక మంత్రం.మరీ రాముడు మంచి బాలుడిలా అలా ఎప్పుడూ పెళ్ళాం కొంగుపట్టుకుని తిరిగితే ఏంబావుంటుందండీ, లైఫన్నాక ఓ సరదా అయినా ఏడవాలిగా. అందుకే వారానికోసారి మందు, అప్పుడప్పుడూ చతుర్ముఖ పారాయణం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రవేశం పొందాలి. సీరియళ్ళలో కూడా హీరోయిన్లు అచ్చు ఇలాంటి కష్టాలే పడుతూ కడవలు కడవలు కన్నీళ్ళు కారుస్తుంటారు. కాబట్టి ఆడాళ్ళు వీటివల్ల తమకు సదరు హీరొయిన్ స్టేటస్ వచ్చేసిందని భావిస్తారే తప్ప బాధ పడరు. అదన్న మాట సంగతి". ముగించాడు నారాయణ.


"ఈ సోదంతా నాకెందుకు గాని, ఇంతకీ బయటికెళ్ళి ఏం పీకుతున్నారు ఈపనులన్నీ ఇలా వదిలేసి?" నిలదీసింది రమ్య.


"ఏం లేదు, ఇవాళ్టినించీ ఏమీ పీకబోవటం కూడాలేదు. అసలు పీక్కోవటానికి ఏమైనా మిగిలి ఉంటే కదా" అన్నాడు నారాయణ బట్టతలను చూపిస్తూ.

Friday 3 September, 2010

మకర దేవత


తోకచుక్క తరువాత చందమామలో ప్రచురించబడిన సీరియల్ మకర దేవత. కథా పరంగా తోకచుక్కకు విరుధ్ధమైన అంశాన్ని ఎంచుకున్నారు రచయిత. తోకచుక్క మాయలూ మంత్రాలతో, చిత్ర విచిత్రాలతో నిండివుంటే మకర దేవత అంతా సాహసోపేత సన్నివేశాలతో, సేనాధిపతుల ఎత్తులూ పైఎత్తులతో సాగుతుంది. తోకచుక్క కథకూ దీనికీ సంబంధం లేకపోయినప్పటికీ అందులోని ముఖ్య పాత్రైన సమరసేనుడు ఈ కథలోనూ మనకు కనిపిస్తాడు. సమరసేనుడు అపారమైన ధనరాసులను కొల్లగొట్టుకుని కుండలినీ ద్వీపానికి తిరిగి వచ్చాక ఆ దేశ పరిస్థితులెలా మారినయ్యో తెలుస్తుంది సీరియల్ ప్రారంభంలో. ఈ మారిన పరిస్థితులు కుండలినీ, మరాళ ద్వీపాల్లో ఎటువంటి అరాచక పరిస్థితులు సృష్టించినయ్యో తెలిపేదే మిగిలిన కథ. తోకచుక్కతో పోలిస్తే దాసరి సుబ్రహ్మణ్యం గారి శైలిలో స్వల్పంగా మార్పు చోటు చేసుకోవడం మనం మకర దేవతలో గమనించవచ్చు.


క్లుప్తంగా కథను పరిశీలిస్తే, ప్రశాంత రాజ్యమైన మరాళ ద్వీపంపై కుండలినీ ద్వీప సైన్యాలు ఒకానొక రాత్రి హఠాత్తుగా దురాక్రమణ చేస్తాయి. ఈ పరిణామాన్ని ఊహించని మరాళద్వీప సైన్యాలు ఓటమి చవిచూస్తాయి. మరాళ ప్రభువైన మందరదేవుడు చేసేదిలేక కొద్దిమంది అంగరక్షకులను వెంటబెట్టుకుని ద్వీపం వదిలి ఒక చిన్న తెప్ప ద్వారా సముద్రంపై పారిపోతాడు. ఆ ప్రయాణంలో అతడు కుండలినీ ద్వీప సైన్యాధ్యక్షుడైన శివదత్తుడిని కలవడం సంభవిస్తుంది. శివదత్తుడి ద్వారా కుండలినీ ద్వీపంలో చెలరేగిన తిరుగుబాటు గురించీ, నరవాహన మిశ్రుడి నమ్మకద్రోహం గురించీ తెలుసుకుంటాడు మందరదేవుడు. మహారాజు చిత్రసేనుడు ఓటమి చెందాడనీ, సేనాని సమరసేనుడు మరణించాడనీ కూడా తెలుసుకుంటాడు. శివదత్తుడికి సహాయం చెయ్యబూనిన కోయ వీరులు కూడా చాలామంది నరవాహనమిశ్రుడి సైనికుల చేతిలో వీర మరణం పాలవుతారు. ఇప్పుడు మరాళ ద్వీపంపై దాడిచేసింది కూడా ఈ నరవాహనమిశ్రుడే. తమ ఉమ్మడి శత్రువైన నరవాహనమిశ్రుడిని ఏనాటికైనా తుదముట్టించడమే శివదత్తుడూ మందరదేవుల ముందున్న ఏకైక లక్ష్యం.

ఇంతలో మందరదేవుడు, శివదత్తులు ప్రయాణిస్తున్న తెప్పలు ఒక ద్వీపాన్ని చేరుకుంటాయి. అక్కడ కొన్ని చిత్రమైన పరిస్థితుల మధ్య వజ్రముష్టి అనే ఒక వ్యక్తిని కలుసుకుని అతడినీ తమ బృందంలో చేర్చుకుంటారు. సముద్రకేతుడనే ఒక సముద్రపు దొంగల నాయకుడిచే మోసగించబడినవాడీ వజ్రముష్టి. అంతా కలిసి ఆ ద్వీపంలోనుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తూండగా సముద్రకేతుడు ఏదో వర్తకుల పడవను వెంటాడుతూ ఆ ద్వీపంకేసే రావడం గమనిస్తారు మందరదేవుడు, శివదత్తులు. వర్తకుల పడవలో వచ్చిన స్వయంప్రభ అనే రాచ కన్యను సముద్రకేతుడు బందీగా పట్టుకుపోతాడు. స్వయంప్రభతో ఉన్న దేవమాయి మాత్రం తప్పించుకుంటుంది. దేవమాయి ద్వారా సముద్రకేతుడెక్కడ ఉండేదీ తెలుసుకుంటారు శివదత్తుడు, మందరదేవులు. హరిశిఖుడనే రాజు గురించీ, అతడి రాజ్యాన్ని పట్టి పీడిస్తున్న మకర దేవత అనబడే ఒక రాక్షసి మొసలి గురించీ కూడా తెలుపుతుంది దేవమాయి. దేవమాయి చెప్పిన గురుతులననుసరించి సముద్రకేతుడి రాజ్యాన్ని చేరి అతడిని సంహరిస్తారు మందరదేవుడు, శివదత్తులు. అటుపిమ్మట హరిశిఖుడి రాజ్యం చేరి మకరదేవతని తాము సంహరిస్తామనీ బదులుగా తమకు తమ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నాల్లో సహాయపడవలసిందనీ కోరుతారు. హరిశిఖుడందుకు అంగీకరిస్తాడు. వజ్రముష్టి మకరదేవతతో హోరాహోరీ పోరాడి దానిని సంహరిస్తాడు. శమన ద్వీప రాకుమారి అయిన స్వయంప్రభను మందరదేవుడు పెళ్ళాడి హరిశిఖుడి సైన్యాలతోనూ, శమన ద్వీప సైన్యాలతోనూ కుండలినీ ద్వీపాన్ని ముట్టడిస్తాడు. ఈలోపే మరొకవైపునుంచి దాడిచేసిన కోయవీరుల ధాటికి నరవాహనమిశ్రుడి సైన్యం చెల్లాచెదురవుతుంది. నరవాహనుడికి మరణశిక్ష విధించబడుతుంది. మందరదేవుడిని కుండలిని, మరాళ ద్వీపాలకు రెండింటికీ రాజును చేసి శివదత్తుడు వానప్రస్థాశ్రమం స్వీకరించడంతో కథ ముగుస్తుంది.

ఈ కథలో మందరదేవుడు కథానాయకుడని మొదట అనిపించినా కథ ప్రధానంగా శివదత్తుడు, వజ్రముష్టిల చుట్టే తిరుగుతుంది. దాదాపు మొదటి సగం అంతా శివదత్తుడి సాహసాల గురించే చదువుతాము. ఈ శివదత్తుడు మహావీరుడు మరియు సేనాని సమరసేనుడికి విశ్వాసపాత్రుడు. ఇతడి పాత్ర ద్వారా మనకు ఎంతటి విపత్కర పరిస్థితులను అయినా మొక్కవోని ధైర్యంతో ఎలా ఎదుర్కొనవచ్చో తెలుస్తుంది. ఇతడు రహస్యమార్గం గుండా పారిపోయి సింహాల మందతో కలిసి శత్రు దళ నాయకుడిని సంహరించే తీరు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ చదువరులను ఉత్కంఠకులోను చేస్తుంది. తమను వెనుక ఎవరూ అనుసరించిరాకుండా రహస్యమార్గంలోని తలుపును లాగి సొరంగం అంతా జలమయం చెయ్యటం రచయిత ఊహాశక్తికి అద్దంపట్టే అద్భుతమైన ఆలోచన. శివదత్తుడు కోయలను సమీకరించి నరవాహనమిశ్రుడిపై మళ్ళీ దాడికి యత్నించే సందర్భంలో వీరుడైన వాడు ఒక్క ఓటమికి కుంగిపోయి ప్రయత్నాన్ని మానుకోడన్న సత్యం కనబడుతుంది. నరవాహనమిశ్రుడు కోయల నాయకుడికి పంపే చిత్ర సందేశం మరో చక్కటి ఆలోచన. కోయలకు నాగరికుల లిపి అర్థంకాకపోవచ్చనే భావనతో రచయిత తెలివిగా ఈ చిత్ర సందేశాన్ని సృష్టించి ఉండవచ్చు.

ఈకథలోని మరో ముఖ్య పాత్ర వజ్రముష్టి. సముద్రకేతుడి వంచనకు గురై పన్నెండేళ్ళపాటు నిర్మానుష్యమైన దీవిలో జీవించవలసి వచ్చిన వజ్రముష్టి పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మలచుకుంటాడు. ఆయుధాలేవీ దొరకని ఆ దీవిలో వట్టిచేతులతోనే ఆహార సంపాదన, ఆత్మరక్షణ చేసుకోవటం అలవరచుకుంటాడు. లేడిని పట్టుకున్న విధానం అతడి నైపుణ్యాన్ని తెలియజేస్తే ఒంటరిగా సముద్రకేతుడి అనుచరులను ఎదుర్కొన్న వైనం అతడి శక్తి సామర్ధ్యాలను, మకర దేవతను సంహరించిన తీరు అతడి సాహసాన్ని తెలియజేస్తుంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా దృఢసంకల్పంతో ఏవిధంగా మనుగడ సాగించవచ్చో వజ్రముష్టి పాత్ర ద్వారా తెలియజేస్తారు రచయిత.


చందమామలోని ఏకథ తీసుకున్నా అందులో నీతి అంతర్లీనంగా ఉంటుంది. మకరదేవత కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ కథ ఎంతగా మనల్ని సాహసోపేతమైన సంఘటనలతోనూ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతోనూ, ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలతోనూ కూడుకున్నదై అలరించినప్పటికీ దీనిలోని అమూల్యమైన సందేశం అంతర్వాహినిగా అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ధనం ఒక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదని, రాజ్యం అంతులేని ధనంతో తులతూగుతున్నంత మాత్రాన మహారాజు తన బాధ్యతలను విస్మరించటానికి వీల్లేదని చిత్రసేన మహారాజు పాత్ర ద్వారా తెలుపుతుంది మకర దేవత. తమ చుట్టూ ఉన్నవాళ్ళను గుడ్డిగా నమ్మటం ఎంత ప్రమాదకరమో, గోముఖ వ్యాఘ్రాలవంటి వాళ్ళు అవకాశం దొరకగానే ఎంతటి నయవంచనకు పాల్పడగలరో మనకు నరవాహనమిశ్రుడి పాత్ర ద్వారా తెలుస్తుంది. ఆపదల్లో సంయమనం కోల్పోకుండా, సమయస్ఫూర్తితో ఏవిధంగా వ్యవహరించాలో శివదత్తుడి పాత్ర మనకు చెబుతుంది. మరో చిన్న విశేషం ఏమిటంటే, కుండలినీ ద్వీపంలోని పరిస్థితులను వర్ణించడం ద్వారా పెద్ద పెద్ద వాళ్ళకే ఒక పట్టాన అర్థంకాని ద్రవ్యోల్బణం గురించి చాలా సరళంగా వివరించారు సుబ్రహ్మణ్యం గారు.